
- రూ.8 కోట్ల అప్పు చేసి కుటుంబ సభ్యులతో జంప్
- ప్రశ్నార్థకంగా విద్యార్థుల పరిస్థితి
మంచిర్యాల, వెలుగు: ఓ కాలేజీ చైర్మన్ బయట కోట్లలో అప్పులు చేసి పరారయ్యాడు. దీంతో ఆ కాలేజీలో చదివే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వారిని మరో కాలేజీలో చేర్పించేందుకు విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంచిర్యాలలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం బోర్డు తిప్పేసింది. చైర్మన్ మహేందర్రెడ్డి పలువురి దగ్గర సుమారు రూ.8 కోట్ల వరకు అప్పులు చేసి కాలేజీ క్లోజ్ చేసి ఇటీవల ఫ్యామిలీతో సహా పరారయ్యాడు.
ఆయన కాలేజీ బిల్డింగును సైతం అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో చదువుకుంటున్న స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యాశాఖ అధికారులు ఎంట్రీ అయ్యారు. ఇన్చార్జి డీఐఈవో అంజయ్య నాలుగు రోజుల క్రితం కాలేజీ బిల్డింగుకు నోటీసులు అంటించారు. సమాచారం లేకుండా కాలేజీని క్లోజ్ చేయడంపై ఇంటర్ బోర్డుకు రిపోర్టు పంపారు. అందులో చదువుతున్న విద్యార్థులు మరో కాలేజీలో చేరేందుకు వారికి సర్టిఫికెట్లు ఇస్తామని మహేందర్రెడ్డి ఇంటర్ బోర్డుకు హామీ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఆయన స్టూడెంట్ల ఇండ్లకు కొంతమందిని పంపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అప్పు ఇచ్చిన వారు శనివారం పోలీసులను ఆశ్రయించారు.