కాంపన్సేషన్ సెస్ ఫండ్ నుంచే చెల్లిస్తాం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కాంపన్సేషన్ జీఎస్టీ చెల్లింపు పై ఏర్పడ్డ వివాదం గురించి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఒకేరకమైన అభిప్రాయం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని, సీజీఎస్టీపై తదుపరి సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మాజీ మంత్రి అరుణ్ జైట్లీతోపాటు తాను రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపుపై ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని పార్లమెంటులో ప్రకటన చేశారు. రెవెన్యూలోటును పూడ్చడానికి అప్పును ఎలా తీసుకోవాలనే విషయమై జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రాలకు కాంపన్సేషన్ సెస్ కిట్టీ నుంచే చెల్లింపులు ఉంటాయని అన్నారు. ‘‘రాష్ట్రాలకు రూ.2.35 లక్షల కోట్ల వరకు రెవెన్యూలోటు ఏర్పడింది. వీటిలో రూ.97 వేల కోట్లు జీఎస్టీ అమలు వల్ల, మిగతాది కరోనా వల్ల ఏర్పడ్డ క్రైసిస్ కారణంగా తగ్గింది. సీజీఎస్టీ చెల్లింపుపై ఏర్పడ్డ విబేధాలను పరిష్కరించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాయి’’ అని వివరించారు.
కార్పొరేట్ అప్పు చెల్లించని, గ్యారంటీ ఇచ్చినవారిపై ఒకేసారి విచారణ
దివాలా కేసుల్లో కార్పొరేట్ డెటర్స్, పర్సనల్ గ్యారంటార్లపై ఒకేసారి విచారణ జరుపుతామని నిర్మల ఈ సందర్భంగా ప్రకటించారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్టరప్టసీ కోడ్ (సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ దివాలా కేసులు త్వరగా పరిష్కారం కావాలన్నా, లిక్విడేషన్ ప్రక్రియ త్వరగా ముగియాలన్నా, కార్పొరేటర్ డెటర్లపై, గ్యారంటీర్లపై ఏకకాలంలో విచారణ జరగాలన్నారు. కరోనా కారణంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్టసీ కోడ్ ప్రకారం డెటర్లపై ఆరు నెలలపాటు విచారణ జరగకుండా అడ్డుకోవడానికి ఈ ఏడాది జూన్లో ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పారు.