మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీకి రూ.50 వేల వాటర్ బిల్లు

మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీకి రూ.50 వేల  వాటర్ బిల్లు

హైదరాబాద్, వెలుగు: వినియోగదారులను వాటర్ బోర్డు షాక్​కు గురిచేస్తోంది. ఎప్పుడు వందల్లో వచ్చే వాటర్ బిల్లులు ఒక్కో సారి వేలల్లో వస్తుండటంతో జనం పరేషాన్ అవుతున్నారు.  ప్రతి నెల ఎక్కడో ఒక చోట ఈ సమస్య వస్తూనే ఉంది. ఇటీవల బీరంగూడ సెక్షన్ 24వ డివిజన్ పరిధి ఆర్సీపురానికి చెందిన మల్లిక ప్రభల అనే మహిళ ఉండే ఇంటికి సెప్టెంబర్ నెలకు సంబంధించిన 
బిల్లు(నం.131602975) రూ.50,771గా ఈ నెల 17న వాటర్ బోర్డు అధికారులు అందించారు. అయితే ఈ బిల్లును చూసిన ఆమె షాక్​కు గురైంది. ప్రతినెల 30 లోపు వచ్చే బిల్లు ఇంత మొత్తం రావడంపై  ఆందోళన చెందింది.

మంగళవారం స్థానిక వాటర్ బోర్డు ఆఫీసుకి వెళ్లి అడిగితే అక్కడ సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా ఆ బిల్లు మొత్తం చెల్లిస్తేనే ఎందుకు ఇలా జరిగిందన్నది చెబుతామనడంతో మల్లిక ఖైరతాబాద్​లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసుకి వెళ్లి డైరెక్టర్ట్ శ్రీధర్​ను ఆశ్రయించింది.  నల్లా మీటర్ పనిచేయకఇలా వచ్చి ఉంటుందని,  మీటర్​ను టెస్టింగ్ కోసం పంపించి బిల్లు సరిచేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మల్లిక చెప్పింది.  డివిజన్ స్థాయిలోనే సమస్యను పరిష్కరించి ఉంటే ఆర్సీపురం నుంచి ఖైరతాబాద్​కు  వచ్చే అవసరం ఉండేవి కాదని ఆమె  తెలిపింది. చాలామందికి ఇలాగే ఎక్కువ బిల్లులు వస్తున్నట్లు 
తెలుస్తోంది.