మాట పట్టింపులకు కుటుంబం బలి

మాట పట్టింపులకు కుటుంబం బలి

ఖమ్మం టౌన్,  వెలుగు: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్ధలు మొత్తం కుటుంబాన్నే బలిగొన్నాయి. భార్య, ఇద్దరు కుమార్తెలకు పురుగులమందు కలిపిన బిర్యాని తినిపించి తరువాత తను తిని నలుగురు విగతజీవులగా మారిన విషాద ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. తెల్లారితే శుభకార్యానికి వెళ్లాల్సి ఉండగా ఈ దారుణం జరగడంతో బంధువుల దుఖఃనికి అంతులేకుండా పోయింది. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన కోయ వెంకటప్రసాద్(43), సుమిత (38) భార్యభర్తలు. వారికి రిశిత(13), జాహ్నవి(9)  కుమార్తెలు. వెంకటప్రసాద్ కారేపల్లిలో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తూ ఖమ్మం మధురానగర్లో ఉండేవారు. ఇటీవల లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా చేరారు. అయితే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఇవి పెరిగినట్లు సమాచారం.

గురువారం కుటుంబ సభ్యులంతా కలిసి ఓ శుభకార్యానికి వెళ్లి పొద్దుపోయాక వచ్చారు. వెంకటప్రసాద్ ఓ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకొని, పురుగులమందు కొనుక్కొని అందులో కలుపుకొని ఇంటికి తెచ్చారు. ముందుగా భార్య, ఇద్దరు పిల్లలకు బిర్యానీ తినిపించాడు. తరువాత తను మరో గదిలోకి వెళ్లి గొల్లెం పెట్టుకొని బిర్యానీ తిన్నడు. శుక్రవారం ఎంత సేపటికీ ఇంటి తలుపులు తీయకపోవటం, ఎంత పిలిచినా పలకకపోవడంతో పక్క పోర్షన్ల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా నలుగురు మరణించారు. అదే రోజు ఓ శుభకార్యానికి వెళ్లాల్సి ఉండగా వెంకటప్రసాద్‌ తండ్రి వెంకయ్య ఊరి నుంచి వచ్చారు. బస్టాండ్‌కు వచ్చి ఎన్నిసార్లు కాల్‌ చేసిన ఎత్తకపోవడంతో నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద కొడుకు, కోడలు, మనవరాళ్లు విగతజీవులుగా పడిఉండడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కుటుంబం అంతా ఒక్కసారిగా మృతిచెందడంతో బంధువులు రోదనలకు అంతులేకుండా పోయింది. డీసీపీ మురళీధర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అపార్ట్‌మెంట్ సీసీ టీవీ ఫుటేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు.