
- అయ్యో.. బిడ్డ!
- హాస్టల్లో పాముకాటుతో ఐదో తరగతి స్టూడెంట్ మృతి
- జ్వరంతో చనిపోయినట్లు నమ్మించేందుకు స్టాఫ్ ప్రయత్నం
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ బాయిస్ హాస్టల్లో ఘటన
- హాస్టల్ నిర్వహణ అధ్వానం.. చుట్టూ పొదలు, చెత్తా చెదారం
- పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా మహిళనూ కరిచిన పాము
- భయంతో ఇంటి బాట పట్టిన విద్యార్థులు
బీర్కూర్/కామారెడ్డి , వెలుగు: ప్రభుత్వ పట్టింపులేని తనం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ బిడ్డ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హాస్టల్లో చదువుకుంటున్న పదేండ్ల బాలుడు పాముకాటుకు గురి కాగా.. సరైన టైమ్లో సరైన ట్రీట్మెంట్ అందించలేదు. వాంతులు చేసుకుంటున్నాడని నార్మల్ ట్రీట్మెంట్ ఇప్పించి, నాలుగు గోలీలు వేసి పడుకోబెట్టారు. తెల్లారి చూసే సరికి ఆ బిడ్డ కన్నుమూశాడు. జ్వరంతో చనిపోయాడని నమ్మించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ వెల్ఫేర్ బాయిస్ హాస్టల్లో జరిగింది. బాలుడు చనిపోయిన తర్వాత హాస్టల్లో పిచ్చిమొక్కలను తొలగిస్తుండగా ఓ కార్మికురాలు కూడా పాముకాటుకు గురైంది.
నేల మీదే నిద్ర
నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన గంగామణి, మురళి దంపతుల కొడుకు సాయిరాజ్(10) బీర్కూర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత మిగతా స్టూడెంట్స్తో కలిసి రూమ్లో సాయిరాజ్ నిద్రపోయాడు. హాస్టల్లో మంచాలు లేకపోవడంతో విద్యార్థులంతా నేల మీదనే పడుకుంటున్నారు. రాత్రి అంతా నిద్రపోయాక సాయిరాజ్ ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు.
మిగతా విద్యార్థులు నిద్రలోంచి లేచి.. విషయాన్ని వర్కర్కు చెప్పారు. లైట్లు వేసి చూడగా రూంలో పాము కనిపించింది. దాన్ని మిగతా స్టూడెంట్స్ చంపేశారు. సాయిరాజ్ వాంతులు చేసుకుంటున్న విషయాన్ని ఇన్చార్జ్ వార్డెన్ ఆర్.సందీప్కు వర్కర్ చేరవేశాడు. అనంతరం ఆ బాలుడ్ని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వాంతులు అయినట్లు చెప్పాడు. అక్కడి సిబ్బంది వాంతులు తగ్గేందుకు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. స్టూడెంట్ను తిరిగి హాస్టల్కు తీసుకొచ్చి పడుకొబెట్టారు. శనివారం తెల్లవారుజామున చూస్తే సాయిరాజ్లో ఎలాంటి కదలిక లేదు. మరోసారి ఈ విషయాన్ని వార్డెన్కు చెప్పి అక్కడున్న వాళ్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాయిరాజ్ తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకోగా.. స్టూడెంట్ చనిపోయినట్లు చెప్పారు. సాయిరాజ్ జ్వరంతో వాంతులు చేసుకొని చనిపోయాడని సిబ్బంది నమ్మించే ప్రయత్నం చేశారు.
చుట్టూ పొదలు, చెత్తాచెదారం
హాస్టల్లో పాముకాటుతో విద్యార్థి చనిపోయిన ఘటన వెనుక ప్రభుత్వ పట్టింపులేని తనం, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. హాస్టల్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. పొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. వీటి వల్ల హాస్టల్ ఆవరణలో పాములు సంచరిస్తున్నాయి. కానీ, ఆవరణను క్లీన్ చేయించే దిక్కు లేదు. బీర్కుర్ బీసీ బాయిస్ హాస్టల్లో వార్డెన్ పోస్టు ఖాళీ ఉండటంతో బోర్లాం హాస్టల్ వార్డెన్ సందీప్కు ఇక్కడ ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల బాగోగులు చూసుకునేవాళ్లు లేరు. పాములు సంచరిస్తున్నా విద్యార్థులు నేలమీదనే పడుకోవాల్సిన దుస్థితి.
శుక్రవారం రాత్రి సాయిరాజ్కు పాము కరువగా.. ఆ విషయాన్ని గుర్తించక, వాంతులు చేసుకున్నాడని చెప్పి నాలుగు గోలీలు వేయించి పడుకోబెట్టారు. హాస్టల్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు సంచరిస్తున్న విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం, హాస్టల్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే తమ కొడుకు చనిపోయాడని సాయిరాజ్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పాముకాటుతో చనిపోయినప్పటికీ జ్వరంతో చనిపోయినట్లు తమకు సిబ్బంది చెప్పారని మండిపడ్డారు. కాగా, పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన విషయం తెలుసుకొని భయంతో మిగతా స్టూడెంట్ల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. వారిని ఇండ్లకు తీసుకెళ్తున్నారు.
వార్డెన్ సస్పెన్షన్
ఇన్చార్జ్ వార్డెన్ సందీప్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున చర్య తీసుకున్నామన్నారు. స్టూడెంట్ చనిపోయిన ఘటనపై ఎంక్వైరీ చేయించనున్నట్లు తెలిపారు.
నిర్లక్ష్యం వల్లే..: సాయిరాజ్ తల్లిదండ్రులు
‘‘హాస్టల్లో స్టాఫ్, వార్డెన్ నిర్లక్ష్యంతోనే మా కొడుకు చనిపోయిండు. పాము కాటు వేసినప్పటికీ .. ట్రీట్మెంట్ ఇప్పించలేదు. పాము కరిచిన విషయాన్ని దాచి జ్వరం వచ్చినట్లు, వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. ఆ అర్ధరాత్రే మాకు చెప్పి ఉంటే.. మేమన్నా ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్లం. మా బిడ్డను ఎవరు తెచ్చిస్తరు?” అంటూ సాయిరాజ్ తల్లిదండ్రులు గంగామణి, మురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
హాస్టల్లోనే శానిటేషన్ ... లేబర్కు పాముకాటు
బీర్కుర్ బీసీ బాయిస్ హాస్టల్లో పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన తర్వాత.. పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులు చేస్తుండగా.. శానిటేషన్ లేబర్ జ్యోతిని కూడా పాము కరిచింది. ఈమెను వెంటనే బాన్సువాడ ఏరియా హస్పిటల్కు తరలించారు. ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ కొలుకుంటున్నది.