
బషీర్ బాగ్,వెలుగు.. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఓ గృహిణిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన ఓ మహిళ (44 )కు మొబైల్ కు పార్ట్టైం జాబ్ అంటూ టెలిగ్రామ్ మెసేజ్ వచ్చింది. ప్రముఖ హోటల్స్ కు 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఉంది. దీంతో ఆమె లింక్ ను ఓపెన్ చేయగా.. 5 -స్టార్ రేటింగ్ ఇచ్చే హోటళ్ల వివరాలు పంపారు. అనంతరం స్క్రీన్ షాట్లను షేర్ చేయమని సూచించారు.
ఒక్కోదానికి రూ. 50 చెల్లించారు. అనంతరం ఎక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆమెను నమ్మించారు. ముందుగా ఆమె 5 వేలు పెట్టగా.. రూ. 6500 లాభం చూపించారు. దీంతో మరింత నమ్మకం కలిగిన ఆమె విడతల వారీగా రూ. 21.73 లక్షలు పెట్టుబడి పెట్టింది. లాభాలు ఇవ్వకపోగా ఇంకా పెట్టుబడి పెట్టాలని ఆమెను ఒత్తిడి చేశారు. అప్పటికే పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని బాధితురాలు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.