కూకట్ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

కూకట్ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.  లేటెస్ట్ గా కూకట్ పల్లి   కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్ లోని ఆలయంలో చోరీ జరిగింది.  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని మూలవిరాట్ కు సంబంధించిన ఆభరణాలను చోరీ చేశారు దుండగులు.  సుమారు రూ. 30 లక్షల రూపాయల పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు.   

జనవరి 7న ఉదయం  ఆలయాన్ని తెరిచి పూజ చేసే క్రమంలో చోరీ జరిగినట్లు గుర్తించారు పూజారులు.  అర్ధరాత్రి 12 గంటల తర్వాత సమయంలో గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేపిహెచ్ బి పోలీసులకు సమాచారం అందించారు ఆలయ నిర్వాహకులు.  ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు  పోలీసులు. ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు గ్రామస్థులు 

రెండు ఆలయాల్లో చోరీ

2025 డిసెంబర్ 6న మంచిర్యాల జిల్లాలో రెండు ప్రధాన ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు.  హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ, శ్రీ మార్కండేయ ఆలయాల్లో చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో ఆలయాల్లోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆదివార ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చోరీపై ఆరా తీశారు. ఆలయంలో చోరీ జరగడం, ఏకంగా అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్ళడంతో గ్రామంలో చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు. ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు గ్రామస్థులు