- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రాయికల్, వెలుగు: కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కుతాయని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఓ గార్డెన్స్లో మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తలతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నా రాయికల్ పట్టణంలో శంకుస్థాపన చేసిన 60 డబుల్ బెడ్ రూం నిర్మాణం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి విడతలవారీగా బిల్లులు మంజూరు చేసిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, రాయికల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత, మాజీ కౌన్సిలర్ అనురాధ, లీడర్లు కొయ్యేడి మహిపాల్, నరసయ్య, నరేశ్, రాకేశ్, షాకీర్, మున్ను, మొబిన్, శ్రీకాంత్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజ్ పాల్గొన్నారు.
