భార్యను నరికి చంపి.. భర్త ఆత్మహత్య

 భార్యను నరికి చంపి.. భర్త ఆత్మహత్య

జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో భార్యను నరికి చంపి భర్త ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్ మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన ముద్దాయిపేట నారాయణ(55), మల్లమ్మ(50) కొడుకు నరసింహులు(20). బతుకుదెరువు కోసం కుటుంబమంతా కొన్నాళ్లుగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటోంది. భార్యాభర్తలు ఇద్దరూ కూలి పనులకు వెళ్తుండగా, కొడుకు ఓ కంపెనీలో ఆఫీస్​బాయ్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం నారాయణ, మల్లమ్మ టేక్మాల్ మండలం అచ్చన్నపల్లిలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లారు. పెళ్లిలో ఒడి బియ్యం పోసి బట్టలు పెట్టడంతో సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండకూడదని సాయంత్రానికి నాదులాపూర్ చేరుకున్నారు. అయితే రాత్రి ఫుల్లుగా తాగిన నారాయణ నిద్రపోతున్న మల్లమ్మపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపాడు. 

తర్వాత భార్య చీరతో ఉరేసుకున్నాడు. చాలా కాలంగా నారాయణ అనుమానంతో భార్యను వేధిస్తున్నాడని, తరచూ గొడపడేవాడని స్థానికులు చెబుతున్నారు. అచ్చన్నపల్లిలోనూ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కొడుకు నరసింహులు తెలిపాడు. పథకం ప్రకారమే నారాయణ.. మల్లమ్మను గచ్చిబౌలికి తీసుకెళ్లకుండా నాదులాపూర్​కు తీసుకొచ్చి చంపేశాడని, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. సోమవారం ఉదయం సీఐ నాగరాజు, ఎస్సై సామ్యా నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నరసింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.