గుడిహత్నూర్, వెలుగు: గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్లో ఓ ఇంట్లో తయారు చేస్తున్న కల్తీ ఈత కల్లును పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగోందికి చెందిన సంతోష్ గౌడ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓటర్లను మభ్యపెట్టడానికి రోజూ ఉచితంగా కల్తీ కల్లు పంపిణీ చేస్తున్నాడు.
ఇదే విషయాన్ని వార్డులో పోటీలో ఉన్న ఆసిఫ్ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు కల్తీ కల్లు తయారు
చేస్తున్న స్థావరానికి వెళ్లి కల్లు నిల్వ ఉంచిన డ్రమ్ములతో పాటు ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉంచిన కల్లును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
