భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజా పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మిలీషియా కమాండర్ గుడ్డి కవాసి మృతి చెందాడు. బైరంగఢ్ పోలీస్స్టేషన్ పరిధిలోని కేశ్కుతుల్-కేశముండి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
కాల్పులు ఆగిపోయాక వెళ్లి చూడగా గుడ్డి కవాసిమృతదేహంతో పాటు దేశీయ తుపాకీ, కుక్కర్ బాంబు, కార్డెక్స్ వైర్, ఫ్యూజ్, డిటోనేటర్, జిలిటిన్స్టిక్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు దొరికాయి. కవాసీపై లక్ష రూపాయల రివార్డు ఉంది. అనేక హత్యలతో పాటు బాంబులు అమర్చిన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు
భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ఎదుట ఆదివారం ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏరియా కమిటీ, చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిష్టారం ఏరియా కమిటీల సాయుధ దళ సభ్యులతో కలిసి పనిచేస్తున్న రవ్వ సన్న(డోకుపాడు), ముసికి సన్న(డోకుపాడు), మడకం జోగా(డోకుపాడు), కొవ్వాసి మంగ( డోకుపాడు), రవ్వ లక్కు(డోకుపాడు), మిలీషియా డిప్యూటీ కమాండర్కర్ణం పొజ్జా(పుట్టపాడు) పలు విధ్వంసకర సంఘటనలు, మందుపాతరలు అమర్చిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించారు.
తెలంగాణ చత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని డోకుపాడు, పుట్టపాడు గ్రామాల నుంచి సీఆర్పీఎఫ్-141 బెటాలియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు వీరి కుటుంబసభ్యులను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని పలుమార్లు చర్చించారు. జీవనోపాధి, పునరావాసం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లొంగిపోయారు. ఏఎస్పీ పంకజ్పరితోష్, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెంట్ రితేశ్ఠాకూర్, సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్ వీర్యాదవ్, అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జున్, దుమ్ముగూడెం, చర్ల సీఐలు అశోక్, రాజువర్మ, దుమ్ముగూడెం ఎస్సై గణేశ్ పాల్గొన్నారు.