రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్బీఐ అనుమతించిందని ఈ పిల్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్, మే 20న ఎస్బీఐ నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19న రూ.2,000 నోట్లను చెలామణిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రెండు వేల నోట్లను బ్యాంక్ లో తిరిగి సమర్పించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.
చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.6.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు తగ్గిందని, అంటే రూ.3.11 లక్షల కోట్లు వ్యక్తుల లాకర్లలోకి చేరాయని, లేదంటే వేర్పాటువాదులు నిల్వ చేశారని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు, డ్రగ్ స్మగ్లర్లు, మైనింగ్ మాఫియాలు, అవినీతిపరుల వద్ద రెండు వేల నోట్లు ఉన్నాయన్నారు లాయర్ అశ్విని ఉపాధ్యాయ్.
గుర్తింపు రుజువు లేకుండానే రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వడం సరికాదని, అవినీతిపరులు నల్లధనాన్ని తెల్లగా ఈజీగా మార్చుకోవచ్చు అంటూ ఉపాధ్యాయ్ తెలిపారు. రద్దు చేసిన రెండు వేల నోట్లను బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్బీఐ, ఎస్బీఐలను కోర్టు ఆదేశించాలని పిఐఎల్ లో పేర్కొన్నారు.