ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు

ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు

ఒక్క కాన్పులో ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టడం సాధారణమైన విషయమే. కొన్నిసార్లు ముగ్గురు, నలుగురు కూడా పుట్టడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడం విశేషం.

ఈ మహిళకు మొదటగా బాబు, తర్వాత పాప, బాబు, బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. మొదటి కాన్పులో ఒక బాబు జన్మించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో కాన్పులో నలుగురు బిడ్డలు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు. పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం తదుపరి చికిత్స కోసం కుటుంబసభ్యులు సిద్దిపేట చిల్డ్రన్ హాస్పిటల్ కు తరలించారు.