ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వచ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదివారం(అక్టోబర్ 26) తీవ్రవాయుగుండంగా మారనుందని.. సోమవారం(అక్టబోర్ 27) తుఫాన్ గా రూపాంతరం చెంది నైరుతి బంగాళాఖాతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ తుఫాను వాయువ్యదిశలో కదిలి మరింత బలపడి 28 అక్టోబర్ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తీవ్ర తుఫాను కోస్తా ఆంధ్ర మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం కారణంగా ఇవాళ ఆదివారం (అక్టోబర్ 26) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం (అక్టోబర్ 27) రేపు తుఫానుగా బలపడిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 27,28,29 భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశంతో హెచ్చరికలు జారీ చేశారు.
