- పెండ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం
- రాజస్థాన్లో ఘోరం
కోట : రాజస్థాన్లోని ఝలావర్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి తిరిగివస్తున్న కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులోని 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా రాజస్థాన్లోని దుంగార్గ్రామానికి చెందినవాళ్లుగా గుర్తించారు. వాళ్లంతా 16 నుంచి 30 ఏండ్లలోపు వయసున్నోళ్లేనని వెల్లడించారు. ఇందులో ముగ్గురు యువకులు అన్నదమ్ములని చెప్పారు. ‘‘శనివారం మధ్యప్రదేశ్లో జరిగిన పెండ్లికి హాజరైన 40 మంది.. మూడు మారుతి ఓమ్నీ వ్యాన్లు, రెండు పికప్ వెహికల్స్లో తిరుగు పయనమయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వీళ్ల వెహికల్స్ లో ఒకదాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఓమ్నీ నుజ్జునుజ్జయింది. ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు ఇరుక్కుపోగా అతికష్టంమీద బయటకు తీశాం”అని పోలీసులు వెల్లడించారు. కారులోని పదిమందిని ఆస్పత్రికి తరలించగా అందులో 9 మంది అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.