ఓల్డ్సిటీ వెలుగు: 150 చోరీలు చేశాడు. రెండేండ్ల జైలుశిక్ష అనుభవించాడు. అయినా .. మారలేదు. బయటకొచ్చినా చోరీలు మానలేదు. పాత నేరస్థుడిని బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ మంగళవారం వివరాలు వెల్లడించారు. బండ్లగూడ అలీనగర్కు చెందిన మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి(52) వరుస చోరీలకు పాల్పడుతుండటంతో 2018లో కంచన్బాగ్ పీఎస్ , 2021లో ఫలక్నుమా పీఎస్ లో పీడీ యాక్ట్ నమోదైంది. రెండేండ్లు జైలుకు వెళ్లి, గత ఆగస్టులో విడుదలయ్యాడు. మళ్లీ బండ్లగూడ పీఎస్ పరిధిలో 3, బాలాపూర్ పీఎస్ పరిధిలో ఒక చోరీ చేశాడు. బండ్లగూడ పోలీసులు కూడా పీడీ యాక్ట్నమోదు చేశారు. సునీల్శెట్టి వద్ద 10 తులాల బంగారం, 10 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు.
