
దొంగలందు వింత దొంగలు వేరయా అన్నట్లు జగిత్యాల జిల్లాలో కొత్త రకం దొంగ దర్శనమిచ్చాడు. కాలేజీలో తరచుగా దొంగతనం చేస్తూ టీచర్లకు, స్టూడెంట్స్ కు సవాల్ గా మారాడు. విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతరత్రా వస్తువులు ఎన్ని ఉన్నా వాటి జోలికి వెళ్లడు. అతని టార్గెట్ పుస్తకాలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉందికదా. కానీ నిజం.. దొంగతనంలోనూ సిన్సియారిటీ పాటిస్తున్నాడా.. లేక చిన్న దొందగతనాలతో సరిపెట్టుకుందాం అనుకున్నాడో కానీ.. పద్ధతిగా బుక్స్ మాత్రమే దొంగిలిస్తూ ఉన్నాడు. మంగళవారం (జులై 22) బుక్స్ దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు.
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుండి విద్యార్థుల పుస్తకాలు మాయమవుతున్నాయి. క్లాస్ రూంలో డెస్క్ లో పెట్టిన పుస్తకాలు మాయం అవుతుండటంపై టీచర్లకు అనుమానం వచ్చింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. వరుసగా బుక్స్ మాయం అవుతుడంటతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో ఈ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది.
సోమవారం (జులై 21) బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండటంతో కళాశాలలోనే విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
►ALSO READ | కోదాడ హైవేపై కల్వర్ట్ ను ఢీ కొట్టిన కారు.. చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం
తమ కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని.. ప్రహరీ గోడ లేకపోవడం వల్లే ఈ దొంగతనం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. త్వరలోనే ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దొంగలందు వింత దొంగలు వేరయా అన్నట్లు జగిత్యాల జిల్లాలో కొత్త రకం దొంగ.. విలువైన కంప్యూటర్లు, ప్రింటర్ల జోలికి వెళ్లడు.. పుస్తకాలే అతని టార్గెట్ ! pic.twitter.com/4p2a8Ggd8z
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) July 22, 2025