బస్సులో మహిళలకు టికెట్ల లొల్లి

బస్సులో మహిళలకు టికెట్ల లొల్లి
  •     బోధన్ ​డిపో కండక్టర్ ​టికెట్లకు డబ్బులు తీసుకున్నాడని గొడవ 
  •     సోషల్ ​మీడియాలో ప్రశ్నిస్తున్న వీడియో వైరల్​
  •     విచారణకు ఆదేశించిన ఎండీ సజ్జనార్​
  •     కండక్టర్​ తప్పు లేదని ఆర్టీసీ ప్రకటన

నిజామాబాద్, వెలుగు : సర్కారు బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేస్తున్నా.. మహిళలకు టికెట్లు ఎలా తీసుకున్నావంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్న వీడియో సోషల్​మీడియాలో వైరలైంది. ఇది సంస్థ ఎండీ సజ్జనార్​దాకా వెళ్లడంతో కండక్టర్​ను డిపో స్పేర్​లో పెట్టి పూర్తి స్థాయి విచారణకు ఆర్ఎం కె.జానారెడ్డిని ఆదేశించారు. అయితే, వారి విచారణలో కండక్టర్​ తప్పేం లేదని తేలింది.

బోధన్​ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు నిజామాబాద్​వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్తున్న  టైంలో పాత బస్టాండ్​లో ఇద్దరు ముస్లిం మహిళలు, వారి కుటుంబానికే చెందిన మరో వ్యక్తి ఎక్కాడు. బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ అని తెలియని అతడు మూడు టికెట్లు ఇవ్వాలని కండక్టర్​ను కోరగా అందరూ మగవారే అనుకుని టికెట్లిచ్చాడు. కొద్దిసేపటికే విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి లేడీస్​కు ఫ్రీ కాబట్టి రెండు టికెట్ల డబ్బులు రిటర్న్​ ఇవ్వాలని కోరాడు.

దీనికి కండక్టర్​ఒప్పుకోలేదు. అప్పటికే ఎస్ఆర్​ రాసినందున మగ ప్రయాణికులు ఎవరైనా ఎక్కితే వారికి ఆ టికెట్లిచ్చి పైసలు వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయినా వినని అతడు కండక్టర్​తో వాగ్వాదానికి దిగాడు. దీన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్​మీడియాలో వైరల్​చేశాడు. ముస్లిం మహిళలు కాబట్టే కండక్టర్ టికెట్లకు డబ్బులు తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ఈ వీడియో ఆర్టీసీ ఎండీ సజ్జనార్​దాకా వెళ్లడంతో కండక్టర్​నర్సింహులును డిపో స్పేర్​లో పెట్టి విచారణకు ఆదేశించారు. తమ ఎంక్వైరీలో కండక్టర్​ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని తేలిందని, ముగ్గురూ మగవారే అనుకుని టికెట్​ఇచ్చాడని ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డబ్బులు కూడా తిరిగి ఇచ్చాడని వివాదం సమసిపోయిందన్నారు.