పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య ఏర్పడిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య ప్రస్తుతం షాద్ నగర్ లో ఉంటున్నాడు. యాదయ్య తల్లి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లిలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది. దీన్ని ఆర్నెల్ల కిందట యాదయ్య 80 లక్షలకు అమ్మాడు. ఇందులో తమ వాటా ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఇవ్వలేదు.
ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ,కుమార్తే నిహారికతో కలిసి బైక్ పై నవాబ్ పేట్ మండలం కారుకొండలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రారంతంలో తిరిగి షాద్ నగర్ కు బయలుదేరారు. ఇది గమనించిన యాదయ్య చిన్నమ్మ కుమారుడు నర్సింహులు సరుకులు రావాణా చేసే వాహనంతో వెంటాడు. మాచారం శివారులో వెనుక నుంచి వచ్చి యాదయ్య బైక్ ను ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు కిందడిపోయారు. వెంటనే తేరుకున్న యాదయ్య లేచి కొంత దూరం పరుగెత్తాడు. కిందపడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా వాహనంతో రెండోసారి ఢీకొట్టాడు నర్సింహులు. ఆమె మళ్లీ కిందపడటంతో వాహనాన్ని పైకి ఎక్కించాడు. దీంతో శైలజ అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. గాయపడిన యాదయ్య, నిహారికలను స్థానికులు షాద్ నగర్ హాస్పిటల్ కు తరలించారు. పొలం అమ్మిన డబ్బు వివాదంలో తమను బంధువులే హత్య చేసేందుకు ప్రయత్నించారని యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.