ఆది సాయికుమార్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ట్రైలర్ను హీరో ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
ఆది సాయి కుమార్ యాక్షన్ లుక్లో పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అర్చన అయ్యర్, స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ పోషించిన ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’ అనే డైలాగ్స్, ట్రైలర్లోని విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
