ఆ భూములు మావే..!..ఏఏఐ ఆఫీసర్ల భూపరిశీలన.. స్థానికుల్లో టెన్షన్‍

ఆ భూములు మావే..!..ఏఏఐ ఆఫీసర్ల భూపరిశీలన.. స్థానికుల్లో టెన్షన్‍
  •    బెస్తం చెరువు వద్ద తమ భూములున్నాయన్న ఏఏఐ  
  •     40 ఏండ్లుగా ఈ భూములకు ప్రహరీ లేక., ఎవరూరాక కబ్జా
  •     వందలాదిగా వెలిసిన ఇండ్లు, గుడిసెలు, ఇతర నిర్మాణాలు
  •     ప్రస్తుతం సర్వే చేసి హద్దులు చూపాలని ఏఏఐ రెక్వెస్ట్​  
  •     ఎయిర్‍పోర్ట్ పునర్నిర్మాణంతో సంబంధంలేదన్న ఆఫీసర్లు 

వరంగల్‍, వెలుగు: మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ భూములను ఏండ్లతరబడి చుట్టూ ఉన్న వ్యక్తులు, అక్రమార్కులు  కబ్జా చేయగా, ఇటువైపు చూడని ఎయిర్‍పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియా (ఏఏఐ) అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. దాదాపు 40 ఏండ్ల కింద మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ సేవలు ఆపేశారు. 

అప్పట్లోనే వారి భూముల చుట్టూరా ఫెన్సింగ్‍ పెట్టుకున్నారు. కాగా, తిమ్మాపూర్‍ శివారులోని ఓ సర్వే నంబర్‍లో ఏఏఐ అధికారులు తమదిగా చెప్తున్న భూములకు మాత్రం ప్రహరీ నిర్మించలేదు. దీంతో ఏండ్ల తరబడి ఓవైపు అక్రమార్కులు, మరోవైపు పేదలు ఈ భూముల్లో  నిర్మాణాలు చేపట్టారు. 

ఆందోళనలో కాలనీవాసులు

రాష్ట్ర ప్రభుత్వం మామునూర్‍ ఎయిర్‍పోర్టును పున:ప్రారంభించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఏడాదిలో భూసేకరణ పూర్తిచేసి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. త్వరలోనే ఎయిర్‍పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియాకు భూముల బదాలాయింపు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, ఈ భూముల పరిశీలనకు వచ్చిన ఏఏఐ అధికారులు పనిలోపనిగా గతంలో తమకు చెందిన 9 ఎకరాల భూములు కబ్జా అయిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 

ఏఏఐ అధికారులు తమదని చెబుతున్న ఆ ప్రాంతం ప్రస్తుతం వరంగల్‍_ఖమ్మం రోడ్డులో నాయుడు పెట్రోల్‍ పంప్‍ దాటాక తిమ్మాపూర్‍ వెళ్లే దారిలో ఉండే బెస్తం చెరువు సమీప కాలనీలుగా ఉంది. గడిచిన 40 ఏండ్లలో ఇక్కడి ప్లాట్లు ఎందరి చేతులో మారాయి. కొనుగోలు చేసినవారు ఇండ్ల నిర్మాణాలు చేసుకుని ఉంటున్నారు. కమ్యూనిస్ట్​ పార్టీలు గుడిసెలు వేశాయి. అయితే మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ పనుల కోసం వచ్చిన ఏఏఐ అధికారులు  ఈ కాలనీల వైపు వెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

ఎయిర్‍పోర్టుపై తప్పుడు ప్రచారం చేయొద్దు 

ఓరుగల్లు అభివృద్ధికి అడుగులు వేసే మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ నిర్మాణ పనులకు అడుగు దూరంలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ కృషి, రైతులు, భూయజమానుల సహకారంతో ఎయిర్‍పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియా అడిగిన దాదాపు 253 ఎకరాలను ఏడాదిలో సేకరించాం. త్వరలోనే ఏఏఐ అధికారులకు భూములు అప్పగించడం ద్వారా ప్రభుత్వం జిల్లావాసుల కలను నెరవేర్చనున్నది. 

ఈ క్రమంలో జిల్లాకొచ్చిన అధికారులు బెస్తంచెరువు వద్ద సైతం ఏఏఐకి భూములున్నాయని చెప్పారు. వారి రికార్డుల ఆధారంగా ఆ భూముల వ్యవహారం ఉంటుంది. మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ ప్రాజెక్ట్​కు కావాల్సిన భూములతో ఇది సంబంధంలేని అంశం. ఓరుగల్లు అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు.  - సత్యశారద, వరంగల్‍ కలెక్టర్‍