న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘ఆప్ కా రామ్ రాజ్య”అనే వెబ్సైట్ను ప్రారంభించింది. బుధవారం ఇక్కడ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి అతిశీ, ముఖ్య నేతలు aapkaramrajya.com వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వెబ్సైట్ ద్వారా రామ రాజ్య స్ఫూర్తితో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చేరవేస్తామని చెప్పారు.
రామరాజ్యం స్ఫూర్తితో గత పదేండ్లలో సీఎం కేజ్రీవాల్ అద్భుతమైన విజయాలను సాధించారని, అందులో స్కూల్స్, మొహల్లా క్లినిక్లు, ఫ్రీ వాటర్, కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. శ్రీరామ నవమి నాడు ప్రజల మధ్య కేజ్రీవాల్ లేకపోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. రామరాజ్యం కాన్సెప్ట్లో చిన్నపెద్ద అనే తేడా లేకుండా అందరి ప్రయోజనాల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను ప్రారంభించామని చెప్పారు.