గాంధీనగర్: గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే రామ భక్తులను ఫ్రీగా అయోధ్యకు పంపిస్తామని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్-లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. శనివారం దాహోద్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వం ప్రజలకోసమే పనిచేస్తుందన్నారు.
రామ భక్తులను ఉచితంగా ప్రత్యేక రైలులో అయోధ్యకు తీసుకువెళతామని హామీ ఇచ్చారు. రైలు అయోధ్యకు బయలుదేరినప్పుడు.. తిరిగి వచ్చినప్పుడు తాను స్టేషన్-కు వస్తానని చెప్పారు. ఆవుల సంరక్షణ కోసం రోజువారీ భత్యం రూ.40 అందిస్తామన్నారు. అవినీతిని నిర్మూలనకు ఆప్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అవినీతిని రూపుమాపడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్య వైద్యం, ఇతర సౌలతులు కల్పిస్తానని చెప్పారు.