ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పక్కటెముకలు, వెన్నెముకకు గాయాలైనట్టు ఎంఆర్ఐ స్కానింగ్ లో తేలింది. ఢిల్లీలోని రీసెర్చ్ రెఫరెల్ హాస్పిటల్ లో ఆదివారం అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అభినందన్ శరీర సామర్థ్యం ఎలా ఉంది? ఆయన ఒంట్లో పాకిస్థాన్ ఏమైనా బగ్స్ అమర్చిందా? వంటి అంశాలను తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అయితే.. అభినందన్ శరీరంలో ఎటువంటి బగ్స్ లేవని డాక్టర్లు నిర్ధారించారు. మిగ్ 21 యుద్ధ విమానం నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆయన కిందపడగానే అక్కడి గ్రామస్థులు దాడి చేశారు. కింద పడ్డప్పుడు, గ్రామస్థుల దాడిలో అభినందన్ పక్కటెముకలు, వెన్నెముకకు గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. ఆయనకు మరో పదిరోజులపాటు ట్రీట్మెంట్ చేస్తామని, కొద్దిరోజులు రెస్ట్ అవసరమని పేర్కొన్నారు.
రెడీ టు ఫైట్
ఆస్పత్రిలో రెస్ట్ తీసుకుంటున్న అభినందన్ ఎప్పుడెప్పుడు డ్యూటీలో జాయిన్ అవుదామా అనే ఆతృతతో ఉన్నారు. తనను త్వరగా ఇంటికి పంపిస్తే తిరిగి విధుల్లో చేరతానని ఆయన అన్నట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. కాగా, అభినందన్ వర్తమాన్కు ‘భగవాన్ మహావీర్ అహింస ’ పురస్కారం దక్కింది. అఖిల భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 17న మహావీర్ జయంతిని పురస్కరించుకుని పురస్కారాన్ని ప్రదానం చేస్తామని మహాసమితి చైర్పర్సన్ మనీంద్ర జైన్ ఆదివారం తెలిపారు. అవార్డుతో పాటు రూ. 2.51లక్షల నగదును అందజేస్తామని వివరించారు.