రిటైర్డ్​ ఇంజనీర్ల ఎక్స్​టెన్షన్లు రద్దు చేయండి : ఉత్తమ్​కు ఇంజనీర్ల వినతి

రిటైర్డ్​ ఇంజనీర్ల ఎక్స్​టెన్షన్లు రద్దు చేయండి : ఉత్తమ్​కు ఇంజనీర్ల వినతి

హైదరాబాద్, వెలుగు :  నీటిపారుదల శాఖలో కొనసాగుతున్న రిటైర్డ్​ ఇంజనీర్ల కొనసాగింపును రద్దు చేయాలని డిపార్ట్​మెంటల్ ​ఇంజనీర్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. డిపార్ట్​మెంట్​లో ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ క్యాడర్​లో పలువురు రిటైర్డ్​ఇంజనీర్లు పని చేస్తున్నారని, వారి ఎక్స్​టెన్షన్​ల కారణంగా జూనియర్ ​క్యాడర్​ ఇంజనీర్లకు ప్రమోషన్​లు దక్కడం లేదని తెలిపారు. తద్వారా వారి శక్తి సామర్థ్యాలు డిపార్ట్​మెంట్ ​పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఎక్స్​టెన్షన్​పై కొనసాగుతున్న వారిని తొలగించి వారి స్థానంలో డిపార్ట్​మెంట్​లో ఆ తర్వాతి క్యాడర్​లో పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జోన్​–6 ఇంజనీర్లకు న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్ ​కుమార్​ రెడ్డిని హైదరాబాద్​ ఇంజనీర్స్ అసోసియేషన్​ నాయకులు కోరారు. సోమవారం జలసౌధలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ రెడ్డి, చక్రధర్​మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. డిపార్ట్​మెంటల్​ప్రమోషన్​లలో జోన్​–6 ఇంజనీర్లకు అన్యాయం జరిగిందని తెలిపారు. డిపార్ట్​మెంట్​లో ఆరుగురు ఈఎన్సీలు ఉంటే అందరూ ఐదో జోన్​వారే ఉన్నారని, 30 సీఈ పోస్టులు ఉంటే ఆరుగురు మాత్రమే ఆరో జోన్​వారు ఉన్నారని, 57 ఎస్ఈ పోస్టుల్లో 33 మంది ఐదో జోన్​వారు, 24 మంది ఆరో జోన్​వారు ఉన్నారని తెలిపారు.