షర్ట్ జేబులో మొబైల్పెట్టుకొని మూవీ రికార్డింగ్..హెచ్డీలో పైరసీ చేసిన వ్యక్తి

షర్ట్ జేబులో మొబైల్పెట్టుకొని మూవీ రికార్డింగ్..హెచ్డీలో పైరసీ చేసిన వ్యక్తి
  • సినిమా రిలీజ్ ​రోజే రికార్డు చేసి అదే రోజు టెలిగ్రాంలో షేర్ 
  • వెబ్​సైట్​ నిర్వాహకులకు అమ్మకం 
  • ఏపీకి చెందిన ఏసీ టెక్నీషియన్​ అరెస్టు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సినిమా రిలీజ్​రోజే పైరసీ చేసి ఆన్​లైన్​లో పెడుతున్న ఓ వ్యక్తిని సైబర్​ క్రైం​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏసీ టెక్నీషియన్​ జానా కిరణ్  కుమార్ గా గుర్తించారు. మే 9న ‘సింగిల్’ తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమా హెచ్​డీ ప్రింట్​ అదే రోజు పలు వెబ్ సైట్లలో సర్క్యులేట్​అయ్యింది. దీనిపై తెలుగు ఫిల్మ్​ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ (టీఎఫ్ సీసీ) యాంటీ వీడియో పైరసీ సెల్ ​ప్రతినిధి యర్రా మనీంద్ర బాబు.. సైబర్  క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న జానా కిరణ్​కుమార్​ను అరెస్ట్​ చేశారు. పెద్ద సినిమాలను పైరసీ చేసి, ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తున్న ముఠాకు ఇతను సహకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు మొదట తమిళ్​ ఎంవీ పైరసీ గ్రూప్  గురించి తెలుసుకున్నాడు. వారి రిక్రూట్‌మెంట్  ఈ మెయిల్​ను సంప్రదించాడు. తెలుగు కంటెంట్‌ను అక్రమంగా సేకరించేందుకు కిరణ్​​వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కొత్త సినిమాలను రికార్డు చేయడానికి నిందితుడు 300 నుంచి 400  డాలర్లను (బిట్‌ కాయిన్‌లో) చార్జ్  చేశాడు. ఎక్కడి నుంచి వీడియో తీస్తే బాగా వస్తుందో అక్కడే సీటు రిజర్వ్​ చేసుకుని సినిమాలు రికార్డు చేశారు. తర్వాత వాటిని టెలిగ్రాంలో వెబ్​సైట్​ నిర్వాహకులకు షేర్  చేశాడు. ఇలా ఒకటిన్నరేండ్లలో హైదరాబాద్‌లోని వివిధ థియేటర్లలో 40 సినిమాలను రికార్డు చేశాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.