- ముగిసిన మూడు రోజుల ఏసీబీ కస్టడీ
హైదరాబాద్, వెలుగు : గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్లో మరి కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ అధికారులు ఏసీబీ కస్టడీలో గుట్టు విప్పినట్లు తెలిసింది. రూ.2.10 కోట్లు దారిమళ్లింపులో బాధ్యులైన వారి గురించి తమ స్టేట్మెంట్లో వారు పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులైన కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి
రంగారెడ్డి జిల్లా గ్రౌండ్వాటర్ ఆఫీసర్ పి.రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్ ను ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. శనివారంతో కస్టడీ ముగియడంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. మూడు రోజుల కస్టడీలో నిందితుల నుంచి అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు తెలిసింది.
వారిని విడివిడిగా ప్రశ్నించారు. శాఖాపరంగా ఎలాంటి లొసుగులు ఉన్నాయనే వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న కీలక నిందితులు మొహిదుద్దీన్, సయ్యద్ ఇక్రముద్దీన్ సాక్షులను బెదిరిస్తున్నట్టు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో సంబంధిత అధికారులను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.