- శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు
- చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్క్వార్టర్స్కు నిందితుడు
- ఏడు గంటల పాటు విచారణఅన్నింటికి సైలెంట్గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను బుధవారం ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్క్వార్టర్స్కు తరలించారు. ప్రత్యేక సెల్లో సాయంత్రం 5 గంటల దాకా విచారించారు. మొదటి రోజు విచారణలో భాగంగా మొత్తం ఏడు గంటల పాటు వ్యక్తిగత వివరాలు, ఆస్తులపై ఆరా తీశారు. స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసి సాయంత్రం మళ్లీ చంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఐదుగురు సభ్యులతో కూడిన ఏసీబీ అధికారుల బృందం విచారిస్తున్నది.
1994కు మందు.. ఆ తర్వాతి ఆస్తులపై ఆరా
శివ బాలకృష్ణ విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు. ముందుగా వ్యక్తిగత వివరాలు సేకరించారు. కుటుంబ నేపథ్యం, ఆదాయ వనరులు, ఉద్యోగంలో చేరిన నాటికి ఆస్తులకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. 1994, ఆగస్టు 10న అనంతపూర్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్గా ఉద్యోగంలో చేరినట్లు గుర్తించారు. అప్పటి నుంచి వచ్చిన జీతం సహా శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తుల గురించి ఆరా తీశారు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకాలు తీసుకున్నారు.
50 పత్రాలు ముందుంచి విచారణ
రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలతో పాటు 54కు పైగా ప్రశ్నలు అడిగారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆయన ముందు ఉంచి ఆరా తీశారు. అయితే, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఆయన సైలెంట్గానే ఉన్నట్టు సమాచారం. సీజ్ చేసిన 50కి పైగా ఆస్తుల డాక్యుమెంట్ల గురించి కూడా ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో కేవలం తన పేరుతో ఉన్న డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే శివబాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. శివ బాలకృష్ణ భార్య పేరు మీద ఉన్న ఆస్తులు వారసత్వంగా వచ్చినట్టు చెప్పారని తెలిసింది. సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు.
ఫ్లాట్స్ ఉన్న వారితో సంబంధం ఏంటి?
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మై హోం బూజాలో డింగరి కిరణ్ ఆచార్య, హనుమకొండ భవానీనగర్లో సింగరాజు ప్రమోద్ కుమార్, మాదాపూర్ సాహితి సుముఖి ఆర్బిట్ అపార్ట్మెంట్, హబ్సిగూడ వీవీ నగర్లో కొమ్మిడి సందీప్ కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్స్ డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించారు. బాచుపల్లి శిల్ప ఆర్వీ ధరిస్తా అపార్ట్మెంట్లో జి.సత్యనారాయణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తపేట ఆర్కే పురంలోని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన వివరాలు అడిగారు. వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.