ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి VRO

ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి VRO

రెడ్​హ్యాండెడ్​ గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు  రూ.3 వేల నగదు స్వాధీనం

మెట్​పల్లి టౌన్, వెలుగు: ఓ వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్​ రెవెన్యూ శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతిపై దృష్టి సారించి ప్రక్షాళనకు ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల ఆగడాలు ఆగడం లేదు. సోమవారం ఓ రైతుకు పట్టదారు పాస్​పుస్తకం, పేరు మార్పిడి చేయడానికి లంచం డిమాండ్​ చేసిన మెట్​పల్లి వీఆర్​ఓ బాపయ్యను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.   మెట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయంలో రూ. 3 వేలు లంచం  తీసుకుంటుండగా పట్టుకుని ఆరెస్టు చేశారు.

కరీంనగర్​ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం…. మెట్​పల్లి మండలంలోని బండలింగాపూర్​ గ్రామానికి చెందిన మహ్మద్​ అనే రైతు ఇటీవల తన  తండ్రి  భాషా గిఫ్ట్​ డీడ్​గా అందించిన రాజేశ్వర్​రావుపేట శివారులోని సర్వే నంబర్​ 67‌‌‌‌‌‌‌‌/ఇ లో గల 23 గుంటల స్థలాన్ని పేరు మార్పిడి చేయాల్సిందిగా కోరుతూ స్థానిక మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 2019 ఏప్రిల్​ 16వ తేదీన పేరు మార్పిడి, పట్టదారు పాస్​ పుస్తకం కోసం  మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా మెట్​పల్లి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికి వీఆర్​ఓ బాపయ్య నిర్లక్ష్యం వహిస్తూ పని పూర్తి చేయడం లేదు. రూ.5 వేలు లంచం ఇస్తే గాని పేరు మార్పిడి, పట్టాదారు పుస్తకం జారీ చేయమని వీఆర్​ఓ బాపయ్య చెప్పాడు.  అంత డబ్బులు ఇచ్చుకోలేనని మహ్మద్​ ప్రాధేయపడడంతో కనీసం రూ.3 వేలు ఇవ్వాలని వీఆర్​ఓ బాపయ్య డిమాండ్​ చేశారు. దీంతో 2019 మే 31వ తేదీన మహ్మద్​ కరీంనగర్​ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో  పథకం ప్రకారం  సోమవారం మెట్​పల్లి తహాసీల్దార్​ కార్యాలయంలోని వీఆర్​ఓలకు కేటాయించిన ప్రత్యేక గదిలో వీఆర్​ఓ బాపయ్యకు మహ్మద్​ రూ.3 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. బాపయ్యను పూర్తి స్థాయిలో విచారించి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నటు డీఎస్పీ వివరించారు.  ఏసీబీ సీఐలు  రాము, సంజీవ్​, వేణుగోపాల్​లు ఉన్నారు.