
- సివిల్ ఇంజినీర్స్ అసోసియేషన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఎత్తైన బిల్డింగ్ల వాటా మరింత పెరుగుతుందని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (ఇండియా) (ఏసీసీఈఐ) శుక్రవారం పేర్కొంది. దేశంలోని ఎత్తైన బిల్డింగ్లలో 77 శాతం ముంబైలోనే ఉన్నాయని తాజాగా సీబీఆర్ఈ రిపోర్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో 8 శాతం ఎత్తైన బిల్డింగ్లే ఉండగా, రానున్న ఏళ్లలో ఈ నెంబర్ 55 శాతానికి పెరుగుతుందని ఏసీసీఈఐ పేర్కొంది. ముంబైలో డిమాండ్ వలన ఎత్తైన బిల్డింగ్లు డెవలప్ అవుతున్నాయని, కానీ హైదరాబాద్కు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉందని వివరించింది. ఇక్కడ భూకంపాల బెడద లేదని, విపరీతమైన గాలులు వీయవని తెలిపింది.
మరోవైపు నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (నాట్కాన్) 2023 ని ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని ఏసీసీఈఐ ప్రెసిడెంట్ (సౌత్ ఇండియా) కే రాజ్కుమార్ అన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో హెచ్ఐసీసీలో ఈ కన్వెన్షన్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 600 డెలిగేట్లు, ఎనిమిదికి పైగా దేశాల నుంచి 14 ఇంటర్నేషనల్ స్పీకర్లు ఈ ఈవెంట్లో పాల్గొంటారని చెప్పారు. ఆర్కిటెక్ట్స్, బిల్డర్లు, డెవలపర్లు, సివిల్ ఇంజినీర్లు ఈ ఈవెంట్లో పాల్గొంటారని రాజ్కుమార్ అన్నారు. నాట్కాన్ 2023 ని ఏసీసీఈఐ హైదరాబాద్ సెంటర్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు.