
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి సెగ్మెంట్లలో రూలింగ్పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటిపోరు తీవ్రమైంది. నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి , కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లకు పోటీగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి , కసిరెడ్డి నారాయణ రెడ్డి...అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పోటీగా నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కొడుకు భరత్ ప్రసాద్...కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధనర్దన్ రెడ్డికి వ్యతిరేకంగా జూపల్లి కృష్ణారావు అసమ్మతి కుంపట్లు రాజేస్తున్నారు. దీనికితోడు ప్రతిపక్ష లీడర్లు కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలపైనా, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపైనా ఆందోళనలు నిర్వహిస్తూ రూలింగ్పార్టీకి ఊపిరాడకుండా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవి శ్రుతిమించి దాడులు, కేసుల దాకా వెళ్తుండడంతో జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, ఇతర లిఫ్టు స్కీములు పనిచేయకపోవడం, డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉండడం, పూర్తయిన చోట లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, అర్హులకు దళితబంధు రాకపోడం, పరిమితంగా పోడు భూముల పట్టాల ఎంపిక వంటి కారణాలతో అధికార పార్టీపై అసంతృప్తి పెరుగుతోంది. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మినహా అరకొర మెజారిటీతో బయటపడ్డ ఎమ్మెల్యేలు ఈసారి ఇంతటి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొని విజయం సాధించడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కీలకమైన కాంగ్రెస్ పార్టీని వర్గపోరు కలవరపెడ్తుండగా, ఉనికి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ఎమ్మెల్యేలు గుడ్మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ అంటూ ఊర్లు చుట్టేస్తుంటే కాంగ్రెస్ నేతలు హాత్సే హాత్జోడో అంటున్నారు. బీజేపీ లీడర్లు ప్రజా గోస బీజేపీ భరోసా అంటూ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు.
నాగర్ కర్నూల్ మర్రికి కూచుకుళ్ల ఎసరు
నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి రూపంలో గండం ఎదురుకానుంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక మర్రి జనార్దన్రెడ్డి ఎమ్మెల్సీ వర్గాన్ని పట్టించుకోకపోవడం, పోలీస్ కేసులు బనాయించే వరకు వెళ్లడంతో కూచుకుళ్ల ప్రెస్మీట్పెట్టి మరీ తన ఆవేదన వెళ్లగక్కారు. అంతకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసినా ఫలితం లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజులుగా కూచుకుళ్ల కొడుకు రాజేశ్రెడ్డి రంగంలోకి దిగి మండలాలు, గ్రామాలు చుట్టేస్తున్నారు. దీంతో రాజేశ్వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ వర్గం మర్రికి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఎమ్మెల్యే మర్రి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలు, స్కూల్స్నిర్మాణం చేపడుతూ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్నుంచి సీనియర్ పొలిటీషియన్ డా.నాగం జనార్దన్రెడ్డి పోటీలో ఉంటానని హింట్ ఇచ్చారు. ఏజ్, హెల్త్ ఇష్యూస్ లెక్క చేయకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్, గట్టి మద్దతుదారులున్నా అధికార పార్టీ దూకుడును ఎంత వరకు తట్టుకుంటారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దిలీపా చారి ఈసారి కూడా బరిలో ఉంటారని తెలుస్తోంది. బీఎస్పీ, వామపక్షాలలూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి.
గువ్వలను ఢీకొడుతున్న తండ్రీ కొడుకులు
అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజుకు పార్టీ లోపల బయట పోరు ఎక్కువైంది. ఫాం హౌస్ ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్తో దూకుడుగా వ్యవహరిస్తాడనే పేరుంది. జడ్పీ చైర్మన్ పదవిని నాగర్కర్నూల్ ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసి సభ్యుడు భరత్ ప్రసాద్కు దక్కకుండా చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గువ్వల ఒకరనే ప్రచారం జరిగింది. రెండు సార్లు చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడడంతో జడ్పీటీసీ పదవికి రిజైన్చేస్తూ కలెక్టర్కు లెటర్ఇచ్చిన భరత్ పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. గతంలో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎంపీ రాములుకు వర్గం ఉంది. దీంతో గువ్వలపై అసంతృప్తితో ఉన్న కేడర్ను, భరత్ను ఏకం చేస్తున్నారు. కంటిన్యూగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఏడాదిగా నియోజకవర్గంలో పార్టీ ప్రోగ్రామ్స్ చేపడుతూ కేడర్లో జోష్ నింపుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారనే సానుభూతి ఉంది. బీజేపీ గట్టి అభ్యర్థి కోసం వెతుకుతోంది. సతీశ్మాదిగ, శ్రీకాంత్ భీమా ఆ పార్టీలో యాక్టివ్గా పని చేస్తూ టికెట్ఆశిస్తున్నారు.
ఎమ్మెల్యే బీరం వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి
కొల్లాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో కుమ్ములాటలు పెరిగాయి. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్రెడ్డి తర్వాత కారెక్కడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జోరు తగ్గింది. ప్రగతిభవన్, తెలంగాణ భవన్లో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడం,అనుచరులపై పోలీస్ కేసులతో బీఆర్ఎస్ నుంచి బలవంతంగా బయటకు పంపించే పరిస్థితులు కల్పిస్తున్నారని సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా వచ్చిన లోకల్బాడీ, గ్రామపంచాయతీ, మున్సిపల్, సింగిల్ విండో ఎలక్షన్స్లో జూపల్లి తన వర్గాన్ని పోటీలోకి దింపి ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్లకు చుక్కలు చూపించారు. ప్రతిరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొల్లాపూర్ పాలిటిక్స్లో హీట్ పెంచుతున్నారు. జూపల్లి త్వరలోనే మరో పార్టీలో చేరతారన్న చర్చ నడుస్తోంది. ఈమధ్య కాంగ్రెస్లో చేరిన వెటరన్ లీడర్ జగదీశ్వర్ రావు, అభిలాష్ రావుల జోడీ పోటీ పడి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్కు అనుకూలమైన ఈ ప్రాంతంలో గెలిచి చూపించాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ఎల్లేని సుధాకర్రావు పూర్తిస్థాయిలో కొల్లాపూర్పై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 37 రోజుల పాటు 496 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సోమశిల బ్రిడ్జి సాధించడం కోసం దాదాపు 10 సార్లు ఢిల్లీకి వెళ్లారు. కొల్లాపూర్ అభివృద్ధి కోసం వివిధ ప్రతిపాదనలతో కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, పార్టీని సమన్వయం చేసుకుంటున్నారు.
కల్వకుర్తిలో అందరూ క్యాండిడేట్లే
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్ యాదవ్ ‘మా పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ’ అని ఓపెన్గా మాట్లాడడాన్ని బట్టి ఆ పార్టీలో గ్రూపుల పంచాయితీ ఎక్కువగానే ఉందని చెప్పకనే చెప్పారు. 2018లో పార్టీ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ..జైపాల్కు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరుండి ఆయనను ఎన్నికల ప్రచార స్టేజీ మీదికి ఎక్కించాల్సి వచ్చింది. జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ తనకే పార్టీ టికెట్ ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రేసులో తాను కూడా ఉన్నట్టు ప్రకటించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వీళ్ల పేర్లే కాకుండా వెల్డండ మండలానికి చెందిన గోలి శ్రీనివాస్ రెడ్డి, మహిళల కోటాలో జడ్పీటీసి విజితారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి మండలానికో ఎమ్మెల్యేను పెట్టాల్సి వస్తుందేమోనని పార్టీ కార్యకర్తలు జోకులేసుకునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పిల్లర్గా భావించే టి.ఆచారి.. కల్వకుర్తి నుంచి పోటీ చేసిన ప్రతిసారి గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైనా నియోజకవర్గాన్నీ వదలకుండా పోరాడుతున్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కేడర్, మోడీ చరిష్మా, ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్లో గ్రూప్ పంచాయితీలు వచ్చే ఎన్నికల్లో తనకు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ స్థాయి లీడర్ అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఏఐసీసీలో బిజీగా ఉండటంతో కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీని, ప్రోగ్రామ్స్ను నడిపించే లీడర్ కరువయ్యారు. మండల స్థాయి లీడర్లు పార్టీపై అభిమానంతో పనిచేసుకుంటూ పోతున్నా వారికి క్లారిటీ లేకుండా పోయింది. నియోజకర్గంలోని రెండు మండలాలు నాగర్ కర్నూల్ జిల్లాలో, నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ముందుండి నడిపించే నాయకుడు లేక చాలా గ్రామాల్లో కేడర్ డిస్ట్రబ్ అయ్యింది. ఇప్పటికిప్పుడు ఫీల్డ్లోకి వచ్చినా పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు అంతంతమాత్రమే.