నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే ప్రమాదం : తలసాని

నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే ప్రమాదం : తలసాని

నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్ చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాలాను ఆయన పరిశీలించారు. ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తక్కువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

గోషామహల్లోని చాక్నవాడిలో రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. ప్రతి శుక్రవారం బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. దీంతో కూరగాయలు ఇతర వస్తువులు కొనేందుకు చాలా మంది జనం అక్కడకు వచ్చారు. అదే సమయంలో నాలా కుంగడంతో కూరగాయల దుకాణాలతో పాటు జనం అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

40 ఏండ్ల క్రితం నాలాపై రోడ్డు వేశారని,  ట్రాన్స్ పోర్ట్, టింబర్ డిపోల నుంచి లారీలు ఓవర్ లోడ్ తో తిరుగుతుండటమే రోడ్డు కుంగిపోవడానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మార్కెట్ జరిగే రోజు కావడంతో సాయంత్రం సమయంలో నాలా కుంగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాదానికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.