పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితురాలు స్వాతి అరెస్ట్

పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితురాలు స్వాతి అరెస్ట్

హైదరాబాద్: జీడిమెట్ల ది పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్‎లో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెంగ్విన్ సంస్థ యజమాని, ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వాతిని సోమవారం (జూన్ 2) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‎లో సంచలనం సృష్టించిన పెంగ్విన్ సంస్థ స్కామ్ కేసును జీడిమెట్ల పోలీసులు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW )కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న పెంగ్విన్ సంస్థ చైర్మన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, హైదరాబాద్ శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‎లో బాలాజీ, స్వాతి అనే ఇద్దరు కలిసి ది పెంగ్విన్ సెక్యూరీటీస్ సంస్థను స్థాపించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ వస్తుందని ప్రజలకు ఆశచూపించారు. దీంతో అధిక వడ్డీ వస్తుందని ఆశపడిన వారు రూ.లక్ష నుంచి కోటి వరకూ పెట్టుబడులు పెట్టారు. అయితే, నిర్వాహకులు రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి పరారయ్యారు.  

చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమనుకుంటూ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ది పెంగ్విన్ సంస్థ నిర్వాహకులపై డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రూ.10 నుంచి 50 కోట్ల మధ్య వసూల్ చేసినట్లు సమాచారం.