నా కల నిజమైంది.. అప్పట్లో కోహ్లీని తీసుకున్నది నేనే : RCB విక్టరీపై విజయ్ మాల్యా

నా కల నిజమైంది.. అప్పట్లో కోహ్లీని తీసుకున్నది నేనే : RCB విక్టరీపై విజయ్ మాల్యా

బెంగుళూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ సాధించాలనే చిరకాల వాంఛను 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ తీర్చుకుంది. ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్‎ను దక్కించుకుంది. 2025, జూన్ 3న గుజరాత్‎లోని నరేంద్ర మోడీ  స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్‎ను చిత్తు చేసి తొలిసారి ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ అవతరించింది. చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్సీబీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంఛైజ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. 

‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025 టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడింది. అత్యుత్తమ కోచింగ్, సహాయక సిబ్బందితో సమతుల్యమైన జట్టు. ఈ సాలా కప్ నమ్దూ. విజేతగా నిలిచిన ఆర్సీబీకి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే తన కల మొత్తానికి నిజమైందన్నారు. ఆర్సీబీ జట్టులోకి విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లను తీసుకున్న ఘనత తనదేనని పేర్కొన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు లెజెండరీ కింగ్ కోహ్లీని ఎంచుకునే అదృష్టం నాకు లభించిందని.. అతడు 18 సంవత్సరాలుగా ఆర్సీబీతోనే ఉండటం గొప్ప విషయమని విరాట్‎ను కొనియాడారు. 

ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన విజయ్ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తు్న్నారు. దేశంలోని వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అభినందనలు తెలపడం కరెక్ట్ కాదని కొందరు.. ట్రోఫీ గెలిచావ్ కదా ఇకనైనా బ్యాంకులకు తిరిగి తీసుకున్న డబ్బులు కట్టేయ్ అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. 

కాగా, 2008లో జరిగిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీ వేలంలో విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లకు ఆర్సీబీ ఫ్రాంచైజ్‎ను కొనుగోలు చేశాడు. ఐపీఎల్  తొలి వేలంలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్సీబీకి బలమైన పునాదులు వేశాడు. కానీ బిజినెస్ లో నష్టాలు వచ్చి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో దేశంలోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి 2016లో విజయ్ మాల్య దేశం విడిచిపారిపోయాడు. 

అనంతరం ఆర్సీబీ జట్టును యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ టేకప్ చేసింది. ప్రముఖ మద్యం పరిశ్రమ, UK-ఆధారిత బహుళజాతి సంస్థ డియాజియోలో భాగమే ఈ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ. ఆర్సీబీ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్వహించబడుతోంది. డియాజియో ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రథమేష్ మిశ్రా ప్రస్తుతం ఆర్సీబీ చైర్మన్‎గా వ్యవహరిస్తున్నారు.