కాగజ్ నగర్, వెలుగు: తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూముల విషయంలో గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ఎమ్మెల్సీ దండే విఠల్సూచించారు. గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, పోడు రైతుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆసిఫాబాద్జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి శివారులో పోడు భూముల విషయంలో గిరిజన రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే సమాచారంతో ఎమ్మెల్సీ మంగళవారం భూముల వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం అటవీ, రెవెన్యూ అధికారులతో చర్చించి గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల వద్ద పాస్ బుక్ లు ఉన్నాయన్నారు. సానుకూలంగా స్పందించిన అధికారులు.. ప్రస్తుతం రైతులు తమ పోడు భూముల్లో సాగు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజన రైతులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
