
ఏటూరునాగారం, వెలుగు : ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ రూల్స్ను సంబంధిత ఆఫీసర్లు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏలో మంగళవారం రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం, ఇందిర సౌర జల వికాసం, విద్య, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన పనులపై సమీక్ష జరిపారు. గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనులు, గిరిజనులకు ఎన్ని వర్క్స్ ఇచ్చారని ఈఈ వీరభద్రంను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ను గిరిజనులకు ఇవ్వలేదని ఈఈ తెలపడంతో ఆగ్రహానికి గురయ్యారు. రూ. 25 లక్షలలోపు పనులను గిరిజనులకే అప్పగించాలని, వీటితో పాటు రిజర్వేషన్ ప్రకారం టెండర్ వర్క్స్ సైతం అప్పగించాలని ఆదేశించారు. '
రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపిక కోసం బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంక్ కాన్సెంట్ ఇప్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఐటీడీఏ డీడీ పోచంను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా ఆయా ప్రాంతాలకే ఖర్చు చేయాలని సూచించారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నెల 6న ములుగు కలెక్టరేట్లో ప్రజా సంఘాలతో సమీక్ష నిర్వహిచాలని పీవోను ఆదేశించారు.