- అర్హులను గుర్తించడానికే ఈ–కేవైసీ అంటున్న డీలర్లు
- ఇంకా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీ పరిధిలో అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్యాస్ కంపెనీలు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ– కేవైసీ నమోదుకు ఆదేశించాయి. దీంతో సిటీలోని వివిధ ఆయిల్కంపెనీల గ్యాస్ డీలర్లు వినియోగదారుల నుంచి ఈ– కేవైసీలు తీసుకుంటున్నారు. అయితే, ఇది కేంద్రప్రభుత్వం సబ్సిడీలను అనర్హులకు కాకుండా అర్హులైన వారికి చెందుతుందా? లేదా తెలుసుకునేందుకు కేవైసీ సేకరిస్తున్నట్టు కొందరు డీలర్లు చెబుతున్నారు. ఈ డేటా ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 500కు గ్యాస్ స్కీమ్ వర్తింజేస్తుందని పేర్కొంటున్నారు.
దీంతో ప్రతిరోజూ కేవైసీ నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరుతున్నారు. కేవైసీలో ఆధా ర్అప్డేట్ చేసుకోవడంతో పాటు, బయోమెట్రిక్, ఐరిస్, ప్రస్తుత చిరునామాలను నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా 500కే గ్యాస్ సరఫరా పథకానికి కూడా అర్హులను ఎంపిక చేయాల్సిందిగా ఆయా కంపెనీలను కోరిన నేపథ్యంలో ప్రస్తుతం భారత్ గ్యాస్, హెచ్పీ, ఇండేన్ గ్యాస్ డీలర్లు కస్టమర్ల నుంచి కేవైసీ సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500 గ్యాస్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తుందని జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని డీలర్లు చెబుతున్నారు.