
వెండితెరపై హీరోగా, విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు. 'గాయం' మూవీతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ హీరో 'లెజెండ్' మూవీలో విలన్ గా నటించి అందరి మెప్పును పొందారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తానేంటో నిరూపించేందుకు రెడీ అయ్యారు. తొలిసారిగా ఓ టాక్ షోకు జగపతిబాబు హోస్ట్గా అడుగుపెడుతున్నారు. ఈ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోతో అలరించడానికి సిద్ధమైయ్యారు జగపతిబాబు. ఈ టాక్ షో ఆగస్టు 17వ తేది నుంచి జీ తెలుగు, జీ5లో ప్రసారం కానుంది . దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. వచ్చే వారంలో గ్రాండ్ గా ప్రారంభం కానున్నఈ షోకు మొదటి అతిథిగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు .. ఒక కొత్త ప్రయాణం. ఈ షోకు వచ్చే అతిథులు తమ మనసులోని భావాలను పంచుకోవడంతో పాటు తమ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలు, మరుపురాని ఘట్టాలను గుర్తుచేసుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోంది. .
ఈ టాక్ షోకు ట్యాగ్ లైను ' చిరునవ్వులతో సాగే ఈ కొత్త ప్రయాణం' అని జోడించారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' విత్ జగపతిబాబు తొలి షో నాగార్జునతో ప్రారంభం అవుతోంది. దీనిలో నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలు, వ్యక్తిగత వివరాలు, విలువైన కుటుంబం జ్ఞాపకాల గురించి పంచుకుంటారు. నాగార్జున తో పాటు ఆయన బ్రదర్ వెంకట్, సిస్టర్ నాగ సుశీల ల సరదా సంభాషణలు, భావోద్వేగాలు ఆకట్టుకోనున్నాయి.
ఈ టాక్ షో ద్వారా జగపతి బాబు తన సుదీర్ఘ అనుభవాన్ని , చతురతను ఉపయోగిస్తూ.. వచ్చే అతిథుల నుంచి ఎప్పుడూ వినని విశేషాలను వెలికితీయగరని అభిమానులు ఆశిస్తున్నారు. అటు ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు , అతిథుల భావోద్వేగాలు, వారి జ్ఞాపకాలు ఆకట్టుకుంటాయని నిర్వాహకులు బలంగా నమ్ముతున్నారు.