నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ను రీ లాంచ్ చేస్తూ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ ‘జీవితంలో ఫస్ట్ ఆఫ్ కంటే సెకండాఫ్ బాగుండాలని చెప్పే కథే ఈ సినిమా. నా రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత పవిత్ర ద్వారా ఇంకో అమ్మను కలుసుకున్నా. ట్రైలర్లో చూసింది కొద్దిగానే.. సినిమా విడుదలయ్యాక ఆటంబాంబ్ పేలుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో తీసినా.. యు.ఎస్.ఎ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలోనూ విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.
ఈ సినిమా నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పింది పవిత్ర లోకేష్. ఇదొక బోల్డ్ కథ అని.. అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందన్నారు ఎం.ఎస్.రాజు. జయసుధ మాట్లాడుతూ ‘నేను, నరేష్ నటులుగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్నాం. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. వెంకటేష్ మహా, అన్నపూర్ణమ్మ, అనన్య నాగళ్ల, వనితా విజయ్ కుమార్, రోషన్, రవివర్మ, అనంత శ్రీరామ్, సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.