
ప్రముఖ నటి గౌతమి(Gouthami) పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారని, అదేంటని అడిగినందుకు తనను, తన కూతురును చంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.
అసలు విషయం ఏంటంటే.. నటి గౌతమికి తమిళనాడులోని పలు చోట్ల రూ.46 కోట్ల చేసే ఆస్తులున్నాయి. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న గౌతమి వైద్యం కోసం కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకున్నారు. ఈ పనిని అలగప్పన్ అనే వ్యక్తికి అప్పగించారు.
అయితే ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్.. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సృష్టించి వాటిని సొంతం చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. అలగప్పన్ తనకున్న రాజకీయ అండతో ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు గౌతమి. తన నుండి అన్యాయంగా లాక్కున్న రూ.25 కోట్ల స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని, తనపై బెదిరింపులకు పాల్పడ్డ అళగప్పన్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నటి గౌతమి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.