- కమిటీకి సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వం
- సభ్యుల్లో కేవీ కామత్, నందన్ నీలేకని కూడా..
- సెబీ దర్యాప్తును 2 నెలల్లోగా ముగించాలని ఆదేశం
- అదానీ షేర్ల ధరలను మానిప్యులేట్ చేశారా
- అనే కోణంలో ఎంక్వైరీ చేయాలని నిర్దేశం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్– హిండెన్బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక జనవరి 24న విడుదలైన అనంతరం స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, అదానీ గ్రూప్ స్టాక్స్లో భారీ హెచ్చుతగ్గులపై దర్యాప్తు చేయాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి గురువారం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ ఓ.పీ.భట్, ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కె.వి.కామత్తో పాటు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని, ప్రముఖ కార్పొరేట్ లాయర్ సోమశేఖర్ సుందరేశన్, రిటైర్డ్ జడ్జి జేపీ దేవ్ధర్ సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. ఈ ప్యానెల్కు అన్ని విధాలా సహకారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్ పర్సన్ను సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్జె.బి.పర్దీవాలాతో కూడిన బెంచ్ ఆదేశించింది. కమిటీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ భత్యాన్ని సెబీ చైర్పర్సన్ నిర్ణయిస్తారని బెంచ్ పేర్కొంది. నిపుణుల కమిటీకి లాజిస్టికల్ సపోర్ట్ అందజేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక సీనియర్ ఆఫీసర్ను నోడల్ ఆఫీసర్గా నియమించాలని నిర్దేశించింది. హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైన అనంతరం స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఎంతోమంది ఇన్వెస్టర్లు నష్టపోయారంటూ లాయర్లు ఎం.ఎల్.శర్మ, విశాల్తివారీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, ముకేశ్కుమార్నాలుగు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల (పిల్) ను దాఖలు చేశారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. వాటిని విచారించిన సుప్రీంకోర్టు బెంచ్.. దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఈమేరకు నిర్ణయాన్ని వెలువరించింది.
ఫిబ్రవరి 17న..
హిండెన్ బర్గ్–అదానీ వ్యవహారంలో కేంద్రానికి ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు షాకిచ్చింది. కేంద్రం సూచించిన నిపుణుల కమిటీని ధర్మాసనం తిరస్కరించింది. సీల్డ్ కవర్లో పేర్లు అందజేయడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ఈ అంశంలో పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ సీల్డ్ కవర్ను కోర్టు అంగీకరిస్తే ప్రభుత్వం నియమించిన కమిటీకి ఓకే చెప్పినట్లు అవుతుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అదానీ ఇష్యూలో తామే కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్సొంతంగా నిపుణుల కమిటీని ప్రకటించింది.
సత్యమే గెలుస్తది: గౌతమ్ అదానీ
సుప్రీంకోర్టు ఆదేశాలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కోర్టు విధించిన గడువులోగా నిజం నిగ్గుతేలుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను గౌతమ్అదానీ మొదటి నుంచీ తోసిపుచ్చుతున్నారు. ఆ ఆరోపణలపై వివరణ ఇస్తూ అదానీ గ్రూప్413 పేజీల సమాచారాన్ని కూడా ఇదివరకే విడుదల చేసింది.