న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు ఈక్విటీ, డెట్మార్గాల్లో 5 బిలియన్ డాలర్లు (రూ. 41,500 కోట్లు) సేకరించింది. అప్పులను తీర్చడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించనుంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఈ గ్రూప్ తీవ్రంగా నష్టపోయింది. గత జనవరి 24 నాటి నివేదికలో హిండెన్బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ మార్కెట్ మానిప్యులేషన్ , అకౌంటింగ్ మోసాలు, మనీలాండరింగ్ చేసిందని ఆరోపించడంతో అదానీ తన వ్యక్తిగత సంపదలో దాదాపు 60 బిలియన్ డాలర్లను కోల్పోయారు. హిండెన్బర్గ్ చేసిన అన్ని ఆరోపణలను గ్రూపు ఖండించింది. ఇప్పుడు అదానీ సంపాదన గత ఏడాది జనవరి లెక్కలతో పోలిస్తే 36 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి సంపద కంటే12 బిలియన్ డాలర్లు తక్కువ.
స్టార్ ఇన్వెస్టర్ జీక్యూజీ పార్ట్నర్స్ గత మార్చి– ఆగస్టు మధ్య ఐదు అదానీ కంపెనీలలో దాదాపు 4.3 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఫ్రెంచ్ కంపెనీ టోటల్ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో 770 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. అదానీ గ్రూపు గత ఏడాది 4.6 బిలియన్ డాలర్ల అప్పులను కూడా తీర్చింది. ప్రమోటర్లు షేర్లపై తీసుకున్న అప్పులను కట్టింది. సిమెంట్ కొనుగోళ్ల కోసం తీసుకున్న అప్పులనూ తీర్చింది.
ఈక్విటీ పెంపు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడింది. ఒక సమయంలో మార్కెట్ విలువలో దాదాపు 150 బిలియన్ డాలర్ల పతనాన్ని చూసినప్పటికీ గ్రూపు ఎటువంటి లిక్విడిటీ లేదా సాల్వెన్సీ సమస్యలను ఎదుర్కోలేదు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్లో పెరుగుదల వల్ల చైర్మన్ గౌతమ్ అదానీ సంపద 84.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన 15వ స్థానానికి చేరుకున్నారు.