మళ్లీ డబ్బు వేటలో అదానీ గ్రూప్

మళ్లీ డబ్బు వేటలో అదానీ గ్రూప్
  • అదానీ ఎంటర్​ప్రైజస్​, అదానీ గ్రీన్​ ఎనర్జీ బోర్డ్​ మీటింగ్​లు
  • 2.5 బిలియన్​ డాలర్ల సేకరణ ?

న్యూఢిల్లీ: హిండెన్​బర్గ్​ ఎపిసోడ్​ తర్వాత మొదటిసారిగా అదానీ గ్రూప్​ మళ్లీ డబ్బు వేట మొదలెట్టింది. రెండు కంపెనీల ద్వారా 2 నుంచి 2.5 బిలియన్​ డాలర్లు నిధులు సమీకరించాలని ప్లాన్​ చేస్తోంది. ఈక్విటీ షేర్ల జారీ లేదా ఇతర మార్గాలలో ఈ డబ్బు సమకూర్చుకోవడానికి అడుగులు వేస్తోంది. అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​, అదానీ గ్రూప్​ ఎనర్జీ లిమిటెడ్​కంపెనీల బోర్డులు నిధుల సమీకరణ ప్రపోజల్స్​ పరిశీలించేందుకు ఈ నెల 13 న అహ్మదాబాద్​లో సమావేశమవుతున్నాయి. ఈ మేరకు స్టాక్​ఎక్స్చేంజీలకు ఆ కంపెనీలు సమాచారం పంపించాయి. కచ్చితంగా ఎంత మొత్తం సమీకరించాలనుకుంటున్నాయో ఈ కంపెనీలు రెండూ స్టాక్​ ఎక్స్చేంజీల ఫైలింగ్​లో వెల్లడించలేదు.

కానీ, యూరప్​, మిడిల్​ ఈస్ట్​లలోని ఇన్వెస్టర్లు చాలా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 2–2.5 బిలియన్​ డాలర్ల దాకా అదానీ గ్రూప్​ సమీకరించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హిండెన్​బర్గ్​ రిపోర్టు బయటకు వచ్చాక తన భారీ ఫాలోఆన్​ పబ్లిక్​ ఆఫరింగ్​(ఎఫ్​పీఓ)ను అదానీ గ్రూప్​ విత్​డ్రా చేసుకున్నది. ఇది జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఆ ఎఫ్​పీఓకు పూర్తి సబ్​స్క్రిప్షన్​ వచ్చినప్పటికీ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ఆరోపణల నేపథ్యంలో నైతిక విలువలు పాటిస్తూ ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నట్లు అదానీ గ్రూప్​ అప్పట్లో ప్రకటించింది. ఎఫ్​పీఓలో ఒక్కో షేర్​ను రూ. 3,112 నుంచి రూ. 3,276 కి జారీ చేయాలని అదానీ ఆఫర్​ చేసింది. ఇప్పుడు మార్కెట్లో అదే షేరు విలువ రూ. 1,984 కి పడిపోవడం గమనించాలి. 

హిండెన్​బర్గ్​ ఆరోపణలు....

అదానీ గ్రూప్​లో అకౌంటింగ్​ ఫ్రాడ్స్​, షేర్ల రేట్ల మేనిప్యులేషన్​ జరుగుతున్నాయంటూ యూఎస్​ షార్ట్ సెల్లర్​ హిండెన్​బర్గ్​ ఈ ఏడాది మొదట్లో ఒక రీసెర్చ్​ రిపోర్టు బయటపెట్టింది. ఆ రిపోర్టు దెబ్బతో అదానీ గ్రూప్​కంపెనీల షేర్లన్నీ భారీగా పడిపోయాయి. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముందు వరసలోకి చేరుకున్న అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీ దీంతో చాలా స్థానాలు కిందకి జారిపోయారు.  మొత్తం 145 బిలియన్​ డాలర్ల సంపద ఆవిరైపోయింది. హిండెన్​బర్గ్​చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అదానీ గ్రూప్​ కొట్టిపారేసింది. ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి ఇటీవల కాలంలో ఈ గ్రూప్ కంపెనీలు తాము అంతకు ముందు తీసుకున్న అప్పులను గడువు కంటే ముందుగానే  చెల్లించిన విషయం తెలిసిందే.

మార్చిలో వాటా అమ్మిన ప్రమోటర్లు....

మార్చి 2023లో అదానీ గ్రూప్​ ప్రమోటర్లు నాలుగు కంపెనీలలో తమ వాటాలలో కొంత భాగాన్ని గ్లోబల్​ ఈక్విటీ ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ జీక్యూజీ పార్ట్​నర్స్​కు అమ్మేశారు. ఈ అమ్మకం ద్వారా ప్రమోటర్లు రూ. 15,446 కోట్లను సమకూర్చుకున్నారు. మార్కెట్లో తనపై నమ్మకాన్ని తిరిగి పెంచుకోవాలని అప్పటి నుంచీ అదానీ గ్రూప్ తీవ్రంగా కృషి చేస్తోంది. కొత్త ప్రాజెక్టులతో బిజినెస్​లోనూ దూసుకెళ్లాలనీ ప్లాన్​లు వేస్తోంది.