
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో కలకలం రేపిన ఘటన
గుడిహత్నూర్, వెలుగు : ఓ కేసులోని నిందితుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన అరుణ్ పై ఓ కేసు నమోదు కాగా కోర్టు విచారణకు హాజరు కావడంలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులకు అరుణ్ కోర్టుకు హాజరు కావాలని తెలపగా ఇంట్లో లేడని చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, స్థానిక బస్టాండ్ వద్ద కనిపించాడు.
అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తన దగ్గర ఉన్న బ్లేడుతో గొంతు కోసుకోగా గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. అతను గతంలోనూ బ్లేడుతో గుడిహత్నూర్ పీఎస్ లో ఎస్ఐ, హోంగార్డులపై దాడి చేసి గాయపరిచినట్టు గుర్తుచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.