
ఆదిలాబాద్, వెలుగు: యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్అదనపు న్యాయమూర్తి పి.శివరాం ప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు లైజన్ అధికారి పండరి తెలిపారు. నార్నూర్ మండలం బాబేఝరికి చెందిన ఓ యువతికి బేల మండలం పాఠగూడకు చెందిన కినక జలపత్ రావు మాయమాటలు చెప్పిపెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీకంగా వాడుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. తనను పెండ్లి చేసుకోవాలని ఆ యువతి కోరడంతో.. తనకు ముందే పెళ్లయ్యిందని, చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు 2017 జూన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై కె. శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలికి పుట్టిన ఆడ శిశువుకు డీఎన్ఏ టెస్టు చేయగా జలపత్ రావు తండ్రిగా నిర్ధారణ అయ్యింది. గురువారం పది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ కుమార్ వాదనలు వినిపించడంతో నేరం రుజువైంది. దీంతో నిందితుడికి మూడేండ్ల జైలు, రూ.8 వేల జరిమానా విధించాలని జడ్జి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు లైజన్ అధికారి తెలిపారు.