
- అట్టహాసంగా బడిబాట ప్రచార జాత కార్యక్రమం ప్రారంభం
ఆదిలాబాద్/మంచిర్యాల/జైపూర్, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆదిలాబాద్ డీఈవో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ ప్రచార జాత కార్యక్రమాన్ని గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి ఫీజుల భారం నుంచి ఊరట పొందాలని సూచించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కడదరపు కిష్టన్న, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు సూర్యకుమార్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శులు స్వామి, ఇస్తారి పాల్గొన్నారు.
సర్కారు బడులను బలోపేతం చేద్దాం
ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల నమోదును పెంచుదామని సర్కారు బడిని బలోపేతం చేద్దామని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. గురువారం ఆయన టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాతను మంచిర్యాల జడ్పీ హైస్కూల్లో జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు టీచర్లు, తల్లిదండ్రులు, అధికారులు, యువత కలసి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజావేణు, సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణ మూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లను ఆదరించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని టీఎస్ యూటీఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని గురువారం జైపూర్మండలంలోని ఇందారం, టేకుమట్ల, శెట్పల్లి, కుందారం,కిష్టాపూర్, వేలాల, పౌనూర్, శివ్వారంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.