- కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి
- అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
ఆదిలాబాద్, వెలుగు : తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో పాటు బీఆర్ఎస్, అఖిలపక్ష నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ రహదారిపై బైఠాయించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ... పత్తి కొనుగోలు కోసం సీసీఐ విధించిన రూల్స్ను ఎత్తేయాలని, ఏడు క్వింటాళ్ల పత్తి పరిమితిని తొలగించాలని, కపాస్ కిసాన్ యాప్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీసీఐ నిబంధనల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రైతులు, నాయకులు రొట్టెలు తింటూ రోడ్డుపైనే నిరసన తెలిపారు. రాస్తారోకోతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, నాయకులు విజ్జగిరి నారాయణ, కొండ రమేశ్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్ పాల్గొన్నారు. కాగా, ధర్నాలో బీఆర్ఎస్ లీడర్లే ఎక్కువ టైం సమయం మాట్లాడడంతో అఖిలపక్ష నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పోలీసులు గంట టైమే ఇచ్చారు.. మేం కూడా ఇక్కడే కూర్చున్నం.. అందరికీ సమయం ఇవ్వాలి’ అని అఖిలపక్ష నాయకులు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో అఖిలక్ష నాయకులకు మైక్ ఇవ్వడంతో వారు
మాట్లాడారు.
