
ఆదిలాబాద్, వెలుగు : సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడించారు. పట్టణంలోని కొత్త కుమ్మరివాడకు చెందిన ధన్గట్ సుధీర్ మూడు నెలల క్రితం మావలలో పశువుల వాహనాన్ని ఆపి యజమానిని చంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
కొంత కాలంగా పరారీలో ఉన్న సుధీర్ ఇటీవల సోషల్ మీడియాలో కత్తులు, డాగర్లతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా పోస్టులు పెట్టడం పట్ల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు అతడిపై 9 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆళ్లపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, మావల సీఐ కె.స్వామి ఉన్నారు.