
- ఢిల్లీలో సత్తాచాటిన పోలీసులను అభినందించిన ఎస్పీ
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో పోలీసు సిబ్బందికి అధునాతన సాంకేతికత పరిజ్ఞానం అందించామని, దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వివిధ రాష్ట్రాల సైబర్ క్రైమ్పై పోలీస్ సిబ్బందికి ఇటీవల ఢిల్లీలో 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో జిల్లాకు చెందిన ముగ్గురు సిబ్బంది పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు కార్యాలయంలో వారికి ప్రశంసాపత్రాలు అందించారు.
ఆదిలాబాద్ కు చెందిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ, సైబర్ ల్యాబ్ కానిస్టేబుల్స్ ఎంఏ రియాజ్, జి.త్రిశూల్ శిక్షణలో మూడు వివిధ గ్రూపుల్లో ట్రైనింగ్తీసుకున్నారని.. రియాజ్ నాయకత్వం వహించిన బృందం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలోని బృందం రెండో స్థానం, త్రిశూల్ ఆధ్వర్యంలోని బృందం మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. వారిని అభినందించారు.
హోంగార్డులకు హెల్త్ కార్డులు అందజేత
హోంగార్డులకు ఎస్పీ హెల్త్ కార్డులు అందజేశారు. మంగళవారం జిల్లా పోలీస్ఆఫీస్లో 240 మంది హోంగార్డులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో హెల్త్ కార్డులు అందించారు. ఈ కార్డులతో హోంగార్డులు, వారికి కుటుంబసభ్యులకు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్పొరేట్ వైద్యంలో సబ్సిడీ వర్తిస్తుందని ఎస్పీ తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సీసీ కొండ రాజు, హోంగార్డు ఆర్ఐఎన్ చంద్రశేఖర్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.