ప్రపంచ వ్యాప్తంగా రాబందుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు హైదరాబాద్ లో వందల సంఖ్యలో కనిపించిన రాబందులు క్రమంగా అంతరించిపోయాయి. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత నగరంలో రాబందు కన్పించింది.
ఆసిఫ్నగర్ క్రాస్రోడ్స్ ప్రాంతంలో తెల్లవీపు కలిగిన రాబందు ఉందన్న సమాచారంతో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకున్నారు. బాగా నీరసించి, ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును నెహ్రూ జూలాజికల్ పార్క్కు తరలించారు. నిన్న(శనివారం) మధ్యాహ్నానికి రాబందు కొంత కోలుకుందని, మాంసం తీసుకుందని అటవీ అధికారులు తెలిపారు.
1999లో చివరిసారిగా హైదరాబాద్లోని హయత్నగర్ సమీపంలో ఉన్న ‘మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్’ పరిసరాల్లో ఈ తెల్లవీపు రాబందు కనిపించింది. అదే ఆఖరు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. తెలంగాణలోని కాగజ్నగర్ ప్రాంతంలో రాబందులు ఉన్నా అవి పొడుగు మూతి రకం జాతి పక్షులని తెలిపారు అధికారులు.